25, నవంబర్ 2011, శుక్రవారం

‘నిర్బంధ’ మీమాంస!

రెండవ శ్రేణి టెలికామ్ తరంగాల కేటాయింపు-2జి స్పెక్టరమ్- కుంభకోణం కేసుకు సంబంధించిన ఐదుగురు నిందితులకు ‘బెయిల్’ లభించడం కన్నా, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలు ఈ కుంభకోణం కేసునకు మాత్రమేకాక మొత్తం న్యాయ ప్రక్రియకు వర్తిస్తుండడం ఈ ప్రాధాన్యానికి కారణం. సంజయ్ చంద్ర, వినోద్‌గోయెంకా, గౌతమ్ దోషి, హరినాయర్, సురేంద్ర పిపారా వంటి కార్పొరేట్ కామందులకు నిర్బంధం నుండి విముక్తి లభిస్తుండడంతో నెలల తరబడి ఎదురుచూస్తున్న రాజకీయ ఘరానాలకు సైతం ‘బెయిల్’ లభించవచ్చునన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇవన్నీ ‘2జి స్పెక్టరమ్’కు సంబంధించిన తాత్కాలిక పరిణామాలు మాత్రమే. ఈ ఐదుగురికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రాతిపదికలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్న రెండు ప్రధాన కారణాలు మాత్రం రానున్న రోజులలో దేశవ్యాప్తంగా న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడం ఖాయం. ఒక నిందితునికి బెయిల్ మంజూరు చేయా లా వద్దా అన్న నిర్ధారణకు ఆ నిందితుని గురించి ప్రజలు ఏమని భావిస్తున్నారన్నది ప్రాతిపదిక కాజాలదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జి.ఎస్.సింఘ్వీ, హెచ్. ఎల్.దత్తు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకున్న మొదటి అంశం. నిందితులకు ‘బెయిల్’ మంజూరు చేయడమే వ్యవస్థీకృతమైన న్యాయ సంప్రదాయమని, విచారణకు గురి అవుతున్న నిందితులను జైలులో ఉంచడం ఈ ‘నిబంధన’కు అపవాదం మాత్రమేనని న్యాయమూర్తులు గుర్తుచేయడం న్యాయ ప్రక్రియను తీవ్రమైన మార్పులకు గురిచేసే అవకాశం ఉంది. నేరస్థుడని ధ్రువపడిన తరువాత మాత్రమే నిందితుడు శిక్షను అనుభవించడం ఆరంభం కావాలన్న న్యాయసూత్రాన్ని గౌరవించడం మాత్రమేకాక అమలు జరపాలని న్యాయస్థానాలకు సర్వోన్నత న్యాయమూర్తులు సలహా ఇవ్వడం రెండవ ప్రధాన అంశం. ఈ రెండు ప్రధాన అంశాలను ‘టెలికామ్ కుంభకోణం’ కేసుకు వర్తింపచేయడంవల్ల ఐదుగురు నిందితులకు బెయిల్ లభించడం న్యాయ ప్రక్రియలోని ఒక అంశం మాత్రమే. దేశవ్యాప్తంగా నిర్బంధంలో ఉన్న వేలాది మంది నిందితులకు ‘బెయిల్’ లభించే అవకాశాలు ఈ వ్యాఖ్యానంవల్ల మెరుగు పడడం ప్రధాన పరిణామం. ప్రజల మనోభావాల ప్రాతిపదికగా కాక సంబంధిత నేరానికి వర్తించే సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని నిందితులకు ‘బెయిల్’ ఇవ్వడం లేదా తిరస్కరించడం కొత్త విషయం కాదు, తరాలుగా వ్యవస్థీకృతం అయి ఉన్న న్యాయ సూత్రం. అలాంటప్పుడు ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మళ్లీ న్యాయ ప్రక్రియ నిర్వాహకులకు గుర్తుచేయవలసిన అవసరం ఏమిటి? టెలికామ్ తరంగాల కేటాయింపునకు సంబంధించిన కుంభకోణం గురించి నెలల తరబడి దేశ ప్రజలు చర్చిస్తుండడం వల్ల ఇలాంటి అవసరం ఏర్పడి ఉందని సుప్రీం న్యాయమూర్తులు భావించి ఉండవచ్చు.
ఈ నిందితులందరూ దాదాపు ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్నారు. అనేకసార్లు వారు ‘బెయిల్’ కోసం దరఖాస్తులు పెట్టుకొనడం, ప్రత్యేక న్యాయస్థానం, ఉన్నత న్యాయ స్థానం, సర్వోన్నత న్యాయస్థానం వాటిని తిరస్కరించడం నడచిన చరిత్ర. దర్యాప్తు పూర్తికాలేదన్నది నిందితులకు బెయిల్ మంజూరుకాకపోవడానికి ప్రధాన కారణం. ఛార్జిషీట్ దాఖలు అయిన తరువాత మాత్రమే ‘బెయిల్’కోసం సంబంధిత ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు కనిమోళి, ఏ.రాజా లాంటి నిందిత రాజకీయవేత్తలకు సలహా ఇచ్చింది కూడ! అందువల్ల చట్టాలకు సాక్ష్యాధారాలకు అనుగుణంగా కాక ప్రజాభిప్రాయం ప్రాతిపదికగా కింది న్యాయస్థానాలు నిందితులకు ‘బెయిల్’ నిరాకరించినట్టు చెప్పడానికి అవకాశమే లేదు. మరి సుప్రీంకోర్టు ఈ సలహా ఎందుకిచ్చినట్టు? న్యాయస్థానాలు ఈ ‘కార్పొరేట్’ నిందితులకు గతంలో బెయిల్‌ను మంజూరు చేయకపోవడానికి కారణం సిబిఐవారు న్యాయస్థానంలో అభియోగ పత్రాన్ని - ఛార్జిషీట్- దాఖలు చేయకపోవడమేనన్నది స్పష్టం. ఇప్పుడు ‘్ఛర్జిషీట్’ దాఖలయింది. దర్యాప్తు పూర్తయిందనడానికి ‘్ఛర్జిషీట్’ దాఖలు కావడమే నిదర్శనం. అందువల్ల నిందితులకు ‘బెయిల్’ లభించింది. ‘్ఛర్జిషీట్’ దాఖలయి, దర్యాప్తు పూర్తయి అనేక రోజులు గడిచి పోయిన తరువాత కూడా నిందితులకు ‘బెయిల్’ లభించకపోవడం గురించి సుప్రీం న్యాయమూర్తులు అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. కానీ ఇలా లభించకపోవడానికి నిందితుల పట్ల ప్రజల మనోభావాలు కారణమని నిర్ధారించడం, ఈ నిర్ధారణ ప్రాతిపదికగా ఇలా వ్యాఖ్యానించడానికి ఇది సందర్భమా అని సామాన్యులకు సందేహాలు కలుగుతున్నా యి. టెలికామ్ తరంగాల కేటాయింపునకు సంబంధించిన కుంభకోణ నిందితులు ఏళ్లతరబడి జైళ్లలో మగ్గిపోలేదు. సిబిఐ వారి దర్యాప్తులు కూడా, సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత, ఏళ్ల తరబడి కొనసాగలేదు. మిగిలిన కుంభకోణాలతో పోలిస్తే ఈ కేసు దర్యాప్తువేగవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తుల నోట వెలువడిన మాటలు మాత్రం నిందితుల పట్ల ‘‘అయ్యో పాపం...’’ అనే భావం కలగడానికి దోహదం చేస్తున్నాయి.
నిందితులను ‘బెయిల్’పై విడుదల చేయడానికి, ‘బెయిల్’కు వారిని పరిమితం చేయడానికి జన మనోభావాలు ప్రాతిదికలు కారాదన్న సుప్రీంకోర్టు, మరోవైపు ప్రజాభీష్టం ఏమిటో గుర్తించినట్టయింది. కానీ ప్రజల మనోభావాలు న్యాయ ప్రక్రియకు ప్రాతిపదికలు కాకపోయినప్పటికీ, సహజంగా సమావిర్భవించే జనాభిప్రాయాన్ని నిరోధించడం మాత్రం సాధ్యం కాదు. సాక్ష్యాధారాల ప్రాతిపదికగా న్యాయస్థానాలు టెలికామ్ కుంభకోణగ్రస్తులైన ఘరానా నిందితులను నేరస్థులుగా నిర్థారిచవచ్చు లేదా నిర్దోషులని ధ్రువీకరిచవచ్చు. కానీ ప్రజలలో అత్యధికులు మాత్రం ఈ నిందితులు నేరస్థులనే విశ్వసిస్తున్నారు. అందువల్ల సర్వోన్నత న్యాయమూర్తుల సముచిత వ్యాఖ్యలు ఇప్పుడు కాక మరో సందర్భంలో వ్యక్తమయి ఉండినట్టయితే మరింత సముచితంగా ఉండేవి. ఏళ్ళ తరబడి ఈ ‘అప్రధాన’ నేరాలకు సంబంధించిన దర్యాప్తులు పూర్తికావు, న్యాయ ప్రక్రియ ఆరంభం కాదు, విచారణ పూర్తికాదు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ కేసులో నుడివినట్టు ‘‘రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రసాదిస్తున్న మానవుని వ్యక్తిగత స్వేచ్ఛ’’ నిజంగా అలాంటి అసంఖ్యాక నిర్భాగ్యులను, విచారణకు గురి అవుతున్న సామాన్య నిందితులకు అందుబాటులోకి రావడంలేదు. అలాంటి సామాన్యులు భవిష్యత్తులో నేరస్థులుగా ధ్రువపడవచ్చు, నిర్దోషులుగా బయటపడవచ్చు. అలా ఆ నిందితులు నిర్దోషులుగా నిరూపితమయినపుడు ఏళ్ళ తరబడి వారు అనుభవించిన నిర్బంధంమాటేమిటి? ‘‘నేరస్థులని ధ్రువపడినప్పటినుంచి మాత్రమే శిక్షను అనుభవించడం ఆరంభం కావాలి’’ అని న్యాయమూర్తులు గుర్తుచేసిన వౌలిక సూత్రం మాటేమిటి? ఇలాంటి నిర్భాగ్య నిందితులకు ‘బెయిల్’ మంజూరు చేసిన సందర్భాలలో సుప్రీం న్యాయమూర్తులు ఇపుడు ఉటంకించిన సూత్రాలను వ్యక్తం చేసి ఉంటే మరింత బాగుండేది. ‘టెలికామ్ కుంభకోణం’ నిందితులు అలాంటి నిర్భాగ్యులు కాదు...