1, డిసెంబర్ 2011, గురువారం

ఆహార స్వప్నం!

ఆహార భద్రత గురించి అవగాహన పెంపొందించడానికి వీలుగా, ముసాయిదా బిల్లు గురించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం సరికొత్త అయోమయం నెలకొనడానికి దోహదం చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారెవరన్న అంశంపై అనేక నెలలపాటు ప్రణాళికా సంఘంవారు సృష్టించిన గందరగోళం సమసిపోతున్న నేపథ్యంలో సరి కొత్త సందేహాలకు ముసాయిదా బిల్లు దోహదం చేస్తోంది. ఈ సందేహాలకు ప్రభుత్వంవారు చెబుతున్న సమాధానాలు స్పష్టంగా లేవు. ‘నగదు బదిలీ’ విధానం ‘ఆహార భద్రత వ్యవస్థ’లో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశం. కానీ ఈ పథకం ఎలా అమలు జరుపుతారన్న విషయమై ప్రభుత్వంవద్ద స్పష్టమైన సమాచారం లేదు. లబ్దిదారులకు నగదును బ్యాంకుల ద్వారా చెల్లిస్తారని వారు స్వేచ్ఛా విపణిలో ఆహార వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చునని విశే్లషణలు, వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఖాతానుండి నగదు బదిలీ అవుతుందట. అయితే ఆహార భద్రత ‘చట్టం’ కింద అర్హులైన వారందరికీ ఇలా నగదు బదిలీ చేస్తారా? లేక కొందరికి మాత్రమే బదిలీ చేసి మరికొందరికి ప్రభుత్వం వారి పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు బియ్యం, గోధుమలను విక్రయిస్తారా అన్నది స్పష్టం కావలసి ఉంది. లాభోక్తులందరికీ ఖాతాలలోకి నగదును బదిలీ చేసినట్టయితే, వారు తమకు నచ్చినచోట పప్పులు బియ్యం గోధుమలు నూనెలు వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ప్రభుత్వం వారి చౌక దుకాణాలకు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యం మాత్రమేకాదు పని కూడా లేకుండాపోతుంది. ప్రభుత్వం రైతుల నుంచి మిల్లర్లనుంచి సేకరించిన ఆహార ధాన్యాలను, ఆహార ఉత్పత్తులను స్వేచ్ఛా విపణిలో మాత్రమే విక్రయించవలసి వస్తుంది. నగదు బదిలీ పథకం వల్ల స్వేచ్ఛా విపణి వీధులలో ఆహార వస్తువుల ధరలు మరింతగా పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతుండడానికి ఇదీ ప్రాతిపదిక. నగదు బదిలీ పథకం సమగ్రంగా లోపరహితంగా అమలు జరిగినట్టయితే క్రమంగా ప్రభుత్వం ధాన్యం, ఆహార ఉత్పత్తులను సేకరించవలసిన అవసరమే ఉండదన్న వాదాన్ని సైతం అనేకమంది సామాజిక ఉద్యమకారులు వినిపిస్తున్నారు. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులను కేవలం స్వేచ్ఛా వాణిజ్య నిర్వాహకులకు అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభుత్వం నిర్ణయంచే గిట్టుబాటు ధరలతో నిమిత్తం లేకుండా, వ్యాపారులు కారుచౌకగా రైతులనుండి వారి ఉత్పత్తులను కాజేయడానికి మార్గం మరింత సులభం అవుతుంది. అందువల్ల ‘నగదు బదిలీ’ ద్వారా కాక ప్రభుత్వ దుకాణాల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేయడంవల్ల మాత్రమే అటు నిరుపేదలకు ఇటు వ్యవసాయదారులకు భద్రత ఏర్పడుతుందన్న వాదం బలం పుంజుకొంటోంది. ‘ఆహార భద్రత’ బిల్లులో పొందుపరచిన మరో అంశం ‘్ఫడ్ కూపన్స్’. ఈ ‘ఆహారం చీటీ’లు జారీచేసే పద్ధతి ఏమిటో అంతుపట్టడం లేదు. లాభోక్తులందరికీ ఈ ‘కూపన్లు’ ఇస్తారా? కొందరికి కూపన్లనిచ్చి, కొందరికి నగదు బదిలీ చేస్తారా? మరి కొందరికి చౌక దుకాణాల ద్వారా ఆహారం పంపిణీ చేస్తారా? ప్రస్తుత సమావేశాలలోనే ‘ఆహార భద్రత’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ‘బిల్లు’ తుది రూపం ఇంతవరకూ స్పష్టంకాకపోవడమే విచిత్రం!
2009నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ ప్రభుత్వ పక్షాలు చేసిన వాగ్దానాలలో ‘ఆహార భద్రత’ అతి ప్రధానమైనది. కానీ ‘కూటమి’ రెండవసారి ప్రభుత్వం ఏర్పాటుచేసి మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఇంతవరకూ ఈ ‘్భద్రత’ వాస్తవం రూపం దాల్చకపోవడానికి కారణం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ఎవరన్న అంశంపై ప్రణాళిక సంఘంవారు సృష్టించిన గందరగోళం. ఈ విషయమై ప్రణాళిక సంఘంవారు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన ప్రమాణ పత్రం గత నెలలో పెద్ద దుమారాన్ని రేపింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని నిర్ధారించడంలో ప్రణాళికా సంఘానికీ, ప్రభుత్వ ఆర్థిక సలహా మండలికి, జాతీయ సలహా మండలికి మధ్య రెండేళ్ళుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు ప్రభుత్వ సంస్థల మధ్య విభేదాలు కొనసాగడం, లోక్‌సభ ఎన్నికల సమయం వరకూ ‘ఆహార భద్రత’ బిల్లును వాయిదావేసే ప్రక్రియలో భాగమన్న ఆరోపణలు కూడ వినవస్తున్నాయి. పట్టణ ప్రాంతంలో నెలకు రు.4,824ల కంటె తక్కువ ఖర్చుచేస్తున్న కుటుంబాలవారు, గ్రామీణ ప్రాంతంలో నెలకు రు.3,905ల కంటె తక్కువ ఖర్చుపెడుతున్న కుటుంబాలవారు మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టుగా భావించాలన్నది ప్రణాళికా సంఘంవారు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన ప్రమాణ పత్రంలోని ప్రధాన అంశం. కుటుంబంలో సగటున ఐదు మంది ఉంటారన్నది ప్రణాళికా సంఘంవారి నిర్ధారణ. అందువల్ల సగటున ప్రతి దినం గ్రామీణ ప్రాంతాలలో ఇరవై రూపాయల కంటె తక్కువ ఖర్చుచేసేవారు పట్టణాలలో ముప్పయిరెండు రూపాయల కంటె తక్కువ ఖర్చుపెట్టేవారు మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు ప్రణాళికా సంఘంవారు సుప్రీంకోర్టుకు నివేదించారు. ఇలా ముప్పయిరెండు రూపాయల కంటె, ఇరవై రూపాయల కంటె తక్కువ ఖర్చుపెట్టేవారు మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు నిర్ధారించడం వివాదగ్రస్తమైపోయింది. పైగా ఆదాయాన్నిబట్టి కాక ఖర్చునుబట్టి నిరుపేదలను గుర్తించడం కూడా విచిత్రమైన ప్రహసనం.
ఇదంతా పథకం ప్రకారం పాలకులు జరుపుతున్న కాలయాపనలో భాగమన్న వాస్తవం సామాన్యులకు సైతం అర్థమయిపోయింది. విమర్శలను తిప్పికొట్టడానికి వీలుగా ప్రణాళికా సంఘంవారు, కేంద్ర ప్రభుత్వంవారు సరికొత్త ప్రతిపాదనను ప్రచారం చేస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారా లేక పైన ఉన్నారా అన్న దానితో నిమిత్తం లేదట. అవసరమైన వారందరికీ చౌక ధరలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయడమే ‘్భద్రత’ పథకం లక్ష్యమన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు అవసరమైన వారిని గుర్తించే కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతోందట. ‘సబ్సిడీ’పై ఆహార ధాన్యాలను పొందగల ‘అవసరమైన’ కుటుంబాలవారు గ్రామాలలో డెబ్బయి ఐదు శాతం మంది పట్టణాలలో యాభయి శాతం మంది ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారించింది. ‘దారిద్య్ర రేఖ’ ప్రాతిపదికన కానప్పుడు ‘అవసరమైన’ లబ్దిదారులను ఏ ‘ప్రాతిపదిక’పై గుర్తించారన్నది కూడ సమాధానం లభించని ప్రశ్న. అంతేకాదు, గ్రామాలలోని ఈ డెబ్బయి ఐదు శాతం కుటుంబాలలో మళ్లీ నలబయి ఆరు శాతాన్ని ‘ప్రాధాన్యం’కల కుటుంబాలుగా నిర్ధారిస్తారట. అలాగే పట్టణ ప్రాంతాలలోని యాభయి శాతం ‘‘అవసరమైన’’ కుటుంబాల నుంచి ఇరవై ఎనిమిది శాతాన్ని ‘‘ప్రాధాన్యం’’కల కుటుంబాలుగా ఎంపిక చేయనున్నారట. ఈ ‘‘ప్రాధాన్యం’’ నిర్ణయించడానికి ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం చెప్పవలసి ఉంది. ‘‘అవసరమైన’’ కుటుంబాలకు, ‘‘ప్రాధాన్యం’’ కల కుటుంబాలకు లభించే ‘ఆహార భద్రత’లో కల అంతరం ఏమిటన్నది కూడ స్పష్టం కావలసి ఉంది. స్పష్టమవుతున్నది మాత్రం ఒక్కటే! ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పుడప్పుడే అది శాసన రూపం ధరించబోదని! పాలక, ప్రతివిపక్షాలకు మధ్య తీవ్ర విభేదాలు చెలరేగి, ‘సెలెక్టు కమిటీ’కి బిల్లును నివేదిస్తారేమో? అప్పుడు విలంబన ప్రక్రియ మళ్ళీ మొదలుకావచ్చు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి