26, డిసెంబర్ 2011, సోమవారం

‘మందకొడి’ మైత్రి!.

‘మందకొడి’ మైత్రి!.December 18th, 2011
ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ రష్యాకు వెళ్లిరావడం మన దేశానికీ ఆ దేశానికీ మధ్య కల మైత్రీబంధం ‘యథాతథం’గా కొనసాగుతోందనడానికి మరో నిదర్శనం. ఉభయ దేశాలమధ్యగల వ్యూహ్మాక దౌత్య సంబంధాలను ‘మందకొడితనం’ ఆవహించి ఉండడం ఈ ‘యథాతథ’ స్థితి! ఈ మందకొడితనాన్ని తొలగించడానికి మన ప్రధాని పర్యటన దోహదం చేయకపోవడం వర్తమాన వైపరీత్యం. రష్యా అధ్యక్షుడు డిమిత్రీ మెద్వెదెవ్, ప్రధామంత్రి వ్లాదిమిర్ పుతిన్ మన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. సౌహార్దపూర్వకంగా చర్చలు జరిపారు. కానీ ఈ పర్యటన సందర్భంగా కుదిరిన చెప్పుకోదగిన కొత్త ఒప్పందాలు లేవు. 1950వ దశకంనుంచి కూడా ఉభయ దేశాలకు మధ్య పరస్పర ప్రయోజనం కలిగించిన అంశం వ్యూహాత్మక సహకారం. ద్వైపాక్షిక సంబంధాలలోను అంతర్జాతీయ వ్యవహారాలలోను 1980వ దశకం చివరివరకూ ఈ వ్యూహాత్మక సహకారం ప్రధానంగా ప్రస్ఫుటించింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఏర్పడిన ప్రధాన విపరిణామం మన కూ రష్యాకు మధ్యగల స్నేహ సంబంధాలలో మందకొడితనం ఏర్పడడం. 2000 వరకు బోరిస్ ఎల్టిసిన్ అధ్యక్షుడుగా ఉండిన కాలంలో మనతో అంటీ ముట్టినట్టు రష్యా వ్యవహరించం ఇపు డు చరిత్ర! వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడుగా ఎన్నికయిన తరువాత ఉభయ దేశాలమధ్య మైత్రీ స్ఫూర్తి చిగురులు వేయటం ఆరంభించినప్పటికీ 1970వ దశకంనాటి స్థాయికి అది ఎదగకపోవడం వాస్తవ వైచిత్రి! దిమిత్రీ మెద్వెదెవ్ 2008లో అధ్యక్షుడయినప్పటికీ రష్యా విదేశాంగ నీతిని నడిపిస్తున్నది మాత్రం ప్రధాని హోదాలో వ్లాదిమిర్ పుతిన్. వచ్చే ఏడు పుతిన్ మళ్లీరష్యా అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. వ్యూహాత్మక విధానంలో పుతిన్ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకి. మన దేశం అమెరికాతో ‘అతి మైత్రి’ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం కారణంగానే ఈ ‘మందకొడితనాన్ని’ వదిలించడానికి రష్యా ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నది స్పష్టం. ఈసంగతి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ఈనెల 15వ, 16ల తేదీలలో రష్యాలో ఉండిన సందర్భంగా మరోసారి ధ్రువపడింది! ప్రధాని జరిపిన చర్చల సందర్భంగా ‘విక్రమాదిత్య’ యుద్ధనౌక సంగతి ప్రస్తావనకు రాకపోవడం ‘వ్యూహాత్మక’మైన మందకొడితనానికి మరో నిదర్శనం. ‘అరిహంత’ జలాంతర్గామి నౌకాదళంలో ప్రవేశించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ‘అరిహంత’ వంటి మరో అణుచోదిత అణ్వస్తవ్రాహక జలాంతర్గామి మనకు ఇప్పటికీ లభించలేదు. సరఫరా చేయడానికి రష్యా అంగీకరించి రెండేళ్లు దాటినా ఇంతరకూ వాగ్దానం నెరవేరలేదు. ఆ సంగతిని ఉభయ దేశాలు మాస్కోలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్రస్తావించకపోవడం ‘మందకొడితనానికి’ మరో ప్రబల సాక్ష్యం. వచ్చే నాలుగు సంవత్సరాలలో ఉభయ దేశాల మధ్య వాణిజ్యం పరిమాణం రెట్టింపు కాగలదన్నది మాత్రమే మన్‌మోహన్‌సింగ్ పర్యటన సందర్భంగా వెల్లడయిన ప్రధాన అంశం. అయితే ఇది కూడా ఉభయ దేశాల ప్రభుత్వ అధినేతలు వ్యక్తంచేసిన ఆకాంక్ష మాత్రమే. ఇందుకోసం ఆచరణాత్మకమైన ఒప్పందం ఏదీ కుదరలేదు. కొన్ని యుద్ధవిమానాలను రష్యా నుండి కొనుగోలు చేయడానికి మనదేశం అంగీకరించడం దౌత్యపరంగా మన వైఫల్యానికి నిదర్శనం. ‘కుడంకులం’ అణు విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి సంబంధించిన మూడవ, నాలుగవ దశల నిర్మాణానికి సంబంధించి రష్యా రాజధానిలో చర్చలు జరిగాయట! మొదటి రెండు దశల ఉత్పాదక వ్యవస్థలు కూలబడి ఉన్న సమయంలో తరువాతి దశల గురించి ఆలోచించడం గుర్రానికి ముందు బండినికట్టడం వంటిది. ‘కుడంకులం’ అణుకేంద్రాన్ని ఆరంభిచవద్దని కోరుతూ తమిళనాడులో పర్యావరణ పరిరక్షకులు ఉద్యమిస్తున్నారు మరి!
ప్రస్తావిత అంశాలు అత్యంత సమంజసమైనప్పటికీ వాటిని సరిఅయిన సమయంలో చర్చించడం దౌత్యనీతిలోని ఔచిత్యం. గత ఏడాది మార్చిలో పుతిన్ మన దేశాన్ని సందర్శించాడు. డిసెంబర్‌లో మెద్విదెవ్ ఢిల్లీకి విచ్చేశాడు. ఈ రెండు సందర్భాలలోను శాంతి ప్రయోజనాలు అణుసహకారం గురించి విస్తృతంగా చర్చలు జరిగాయి. మనదేశంలో కొత్తగా అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రాల నిర్మాణానికి రష్యా అంగీకరించినట్టు అపుడు ప్రచారమైంది. కానీ కొత్త కేంద్రాలు ఎక్కడ నిర్మిస్తారో ఇంతరకు వెల్లడి కాలేదు. ‘కుడంకులం’ అణుకేంద్రం సంగతి మాత్రం ఆ రెండు సందర్భాలలోను ప్రచారం కాలేదు. కుడంకులం గురించి గత ఏడాది ప్రజలలో వ్యతిరేకత ఏర్పడలేదు. అందువల్ల గత ఏడాది మొదటి ఉత్పాదక వ్యవస్థను ఆరంభించి ఉండి ఉంటే మిగిలిన మూడు దశల నిర్మాణం గురించి చర్చలు వేగవంతమయి ఉండేవి. ‘కుడంకులం’ గురించి ఒప్పందాలు జరిగి ఐదేళ్లు దాటింది. ‘రియాక్టర్’ వ్యవస్థను సరఫరా చేయడంలో రష్యా జాప్యం చేయంవల్లనే నిర్థారిత సమయంలో ప్రాజెక్టు నిర్మాణం కాకపోవడానికి కారణం.
చైనా ప్రభుత్వం మన సముద్ర జలాలలోకి చొచ్చుకొనివస్తున్న నేపథ్యంలో మన రక్షణ వ్యూహంలో అణుచోదిత జలాంతర్గాములు, యుద్ధనౌకలు అత్యంత కీలకమైనవి. ‘అరిహంత’ను మనం స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించుకొన్నాము. అది సముద్ర ప్రవేశం చేసి పద్దెనిమిది నెలలు పైబడింది. అలాంటి మరో జలాంతర్గామి నిర్మించడానికి రెండేళ్లు పడుతుందని అపుడు నిర్థారణ జరిగిందట. అందువల్ల రష్యానుంచి వెంటనే మరో అణు జలాంతర్గామిని తెప్పిస్తున్నట్టు ప్రచారం జరిగింది. సరఫరా చేయడానికి రష్యా ఒప్పుకొంది. కానీ ఇంతవరకు ఆ జలాంతర్గామి మనకు దక్కలేదు! ఎపుడు అప్పగిస్తారని మన్‌మోహన్‌సింగ్ మాస్కోలో ప్రశ్నించలేదు! మరోవైపు, విమాన వాహన యుద్ధ నౌకను మన ప్రభుత్వం 2004లో కొనుగోలు చేసింది. పుట్టని బిడ్డకు పేరు పెట్టిన చందంగా దేశానికి తరలి రాకముందే దానికి ‘ఐఎఎన్‌ఎస్ విక్రమాదిత్య’ అని నామకరణం కూడా చేసుకున్నాము. అది కొత్త యుద్ధనౌక కాదు. రష్యావారు దాదాపు పదేళ్లపాటు ఉపయోగించిన పాతబడిన నౌక! ఈ ‘సెకెండ్ హ్యాండ్’ యుద్ధ నౌకకు అధునాతనరీతిలో మరమ్మతులు జరిపి మనకు అప్పగించడానికి 2004లో రష్యా వాగ్దానం చేసింది! కానీ రష్యా ప్రభుత్వం నౌకను అప్పగించడాన్ని పదే పదే వాయిదా వేస్తుండడం ‘మందకొడి’ మైత్రికి మరో తార్కాణం. ఈలోగా నౌక ధరను రష్యా ప్రభుత్వం రెండుసార్లు పెంచడం మాత్రమే మైత్రీపథంలో జరిగిన ప్రగతి. వచ్చే ఏడాదినాటికి తప్పనిసరిగా ‘విక్రమాదిత్య’ మనదేశానికి అరుదెంచనున్నట్టు గత ఏడాది పుతిన్, మెద్విదెవ్ పర్యటనల సందర్భంగా మన ప్రభుత్వం ప్రకటించింది. కానీ 2014 వరకూ ‘విక్రమాదిత్య’ మనకు దక్కదని 2009లో నిర్థారణ అయిపోయిందట! ఈ విషయమై మన ప్రభుత్వం స్పష్టీకరణలు కోరడంలేదు. ఈ మందకొడితనాన్ని మన్‌మోహన్‌సింగ్ మాస్కోలో సరికొత్తగా ప్రదర్శించి స్వదేశానికి తిరిగి వచ్చారు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి