26, డిసెంబర్ 2011, సోమవారం

అజిత్‌సింగ్ ‘ఫ్రాధాన్యం’

అజిత్‌సింగ్ ‘ఫ్రాధాన్యం’.December 20th, 2011
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగనున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ మరోసారి విజయం సాధించడం ఖాయమన్న భయం ఆమె ప్రత్యర్థులందరినీ పీడిస్తోంది. రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకుడు అజిత్‌సింగ్‌కు మరోసారి కేంద్రమంత్రి పదవి దక్కడానికి ఈ ‘్భయం’ నేపథ్యం. కూలబడి ఉన్న పౌర విమానయాన రంగాన్ని కోలుకునేలా చేయడం ఆయనకు ఎదురౌతున్న ప్రధాన సమస్య - అన్నది ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రచారం. కానీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో కుంటుతున్న కాంగ్రెస్‌ను పరిగెత్తించడం ఆయనకు ఎదురౌతున్న విషమ పరీక్ష అన్నది రాజకీయ మంత్రాంగం గురించి అవగాహన ఉన్న వారికి అర్థమైన వాస్తవం. నష్టాల ఊబిలో పడి నానాటికీ కూరుకొని పోతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థను బయటికి లాగి ఆకాశంలో ఎగిరించే సామర్థ్యం అజీత్‌సింగ్‌కు మాత్రమే ఉందని ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ‘కనిపెట్టడానికి’ కారణం, ఈ కొత్త మంత్రికి ఉత్తరప్రదేశ్‌లో కొంత ‘కులం బలం’ ఉండడమే! కుల బలం వోట్ల రూపంగా మారి తమకు వెన్నుదన్నుగా నిలబడితే రానున్న శాసనసభ ఎన్నికలలో తమ బలం పెరుగుతుందన్నది కాంగ్రెస్ అధినేతల విశ్వాసం! మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు కనుక ఉత్తరప్రదేశ్‌లో అజిత్‌కు గొప్ప గుర్తింపు ఉంది. అయితే ఆయన సహకరించిన వారందరూ ఆయన పార్టీకి వోట్లు వేయకపోవడం దశాబ్దుల చరిత్ర. 1970వ దశకం ముగిసేవరకూ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ప్రధా న ప్రత్యర్థి చరణ్‌సింగ్. జనతాపార్టీలో కూడా ఆయన అధికార కేంద్ర బిందువుగా అలరారడం చరిత్ర. అయితే ఈ చరిత్ర అజిత్‌సింగ్‌కు వారసత్వంగా సంక్రమించక పోవడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల గతిని మార్చిన విప్లవాత్మక పరిణామం! ఉత్తరప్రదేశ్ రాజకీయాలు గరిమనాభి అగ్రకులాల నాయకులనుండి వైదొలగి వెనుకబడిన కులాల వోటర్ల మధ్య ప్రతిష్ఠ కావడం ఈ విప్లవ పరివర్తనకు ప్రాతిపదిక. వెనుకబడిన కులాల నుండి పుట్టుకొచ్చిన ములాయంసింగ్, కల్యాణ్‌సింగ్ వంటి నాయకులు అజిత్‌సింగ్ పార్టీని మరుగుజ్జుగా మార్చేశారు. అందువల్లనే అజిత్‌సింగ్ తమ పార్టీ నాయకత్వం స్వీకరించినప్పటినుంచి ఏదో ఒక ప్రధాన పార్టీకి తోకగానే కొనసాగుతున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమయినప్పటినుంచి ‘తోక’ పార్టీలు ప్రధానపార్టీలను ఆడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ఐక్యప్రగతి కూటమి- యుపిఏలో రాష్ట్రీయ లోక్‌దళ్ చేరిపోవడం కాని వెనువెంటనే అజిత్‌సింగ్ మంత్రి పదవి లభించడం కాని ఈ ‘వాలక్రీడ’- తోకలాటకు కొనసాగింపు మాత్రమే!
ఐదుమంది లోక్‌సభ సభ్యుల ‘యుపిఏ’లో చేరడంకన్నా ఉత్తరప్రదేశ్‌లో తమ వోటర్ల సంఖ్య పెరగడం కాంగ్రెస్ పార్టీకిప్పుడు ప్రధానం. రాహుల్‌గాంధీ నాయకత్వ పటిమకు ఈ ఎన్నికలు గీటురాళ్లన్న ప్రచారం గత ఏడాదికి పైగా జరుగుతోంది. 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఆ రాష్ట్రంలో 22 స్థానాలు లభించినప్పటినుంచీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం ఆకాంక్ష. ఈ ఆకాంక్షను సాకారం చేయడానికి అజిత్‌సింగ్ దోహదం చేయగలడా అన్నది సమాధానం దొరకని ప్రశ్న. అజిత్ పలుకుబడి మాత్రమే కాదు విశ్వసనీయత సైతం నానాటికీ దిగజారుతుండడం ప్రస్ఫుటిస్తున్న విపరిణామం. 1990వ దశకంలో ప్రధాని పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో మంత్రిగా ఉండిన అజిత్‌సింగ్ ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలన్నింటితోను జట్టుకట్టడం వోటర్లలో ఆయన విశ్వసనీయత తగ్గిపోవడానికి కారణం. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీతోను, ములాయంసింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతోను, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీతోను ఆయన గతంలో పొత్తులు పెట్టుకున్నాడు. ఈ పొత్తుల కారణంగా అజిత్‌సింగ్ పార్టీకి మాత్రమే సీట్ల ప్రయోజనం సమకూడింది. ఒంటరిగా పోటీచేస్తే ఒక్క లోక్‌సభ స్థానంలోనైనా విజయం సాధించగల బలం రాష్ట్రీయ లోక్‌దళ్‌కు లేదు. 2009నాటి ఎన్నికలలో అజిత్‌సింగ్ పార్టీ ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకొనడానికి కారణం ‘్భజపా’తో పెట్టుకున్న పొత్తు. కానీ ఈ పొత్తు ‘్భజపా’ నాలుగవ స్థానానికి దిగజారిపోకుండా నిరోధించలేకపోయింది! అందువల్ల కాంగ్రెస్‌తో పొత్తువల్ల అజిత్‌సింగ్ పార్టీకి బలం పెరుగుతుంది! కానీ కాంగ్రెస్ పోటీచేసే స్థానాలలోని అజిత్ వోటర్లు ప్రధానంగా ‘జాట్’లు కాంగ్రెస్‌ను బలపరచడం మాత్రం సందేహాస్పదం... ఎవరికి లాభం?
ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రధాన జాతీయ పక్షాలు మూడు నాలుగు స్థానాలకోసం పోటీ పడడం దశాబ్దిగా కొనసాగుతున్న రాజకీయ విచిత్రం. 2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భాజపాకు 50, కాంగ్రెస్‌కు 22స్థానాలు దక్కాయి. 403 స్థానాలున్న శాసనసభలో మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి 205 స్థానాలు గెలిచింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక పార్టీకి శాసనసభలో స్పష్టమైన మెజారిటీ రావడం రెండు దశాబ్దులలో అది మొదటిసారి. అంతవరకు కాంగ్రెస్ మద్దతుతోను ఇతర పార్టీల మద్దతుతోను ప్రభుత్వం నడిపిన ములాయంసింగ్ బలం తొంబయి తొమ్మిదికి దిగజారింది. కానీ 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో బలాబలాలు తారుమారు కావడం ఆశ్చర్యం గొలిపిన పరిణామం. రాష్ట్రానికి చెందిన ఎనబయి లోక్‌సభ స్థానాలలో సమాజ్‌వాదీ పార్టీ ఇరవై మూడింటిని గెలుచుకోగా అధికార ‘బహుజన సమాజ్’కు ఇరవై మాత్రమే దక్కాయి. శాసనసభ ఎన్నికలలో నాలుగవ స్థానంలో ఉండిన కాంగ్రెస్ ఇరవై రెండు స్థానాలు కైవసం చేసుకొని, రెండవ స్థానానికి ఎదిగింది. భాజపా నాలుగవ స్థానానికి దిగజారిపోయింది. లోక్‌సభ ఎన్నికలలో కేవలం మూడున్నర శాతం వోట్లను పొందిన అజిత్‌సింగ్ పార్టీకి ఐదుస్థానాలు లభించగా ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న భాజపాకు పదిహేడున్నర శాతం మాత్రమే వోట్లు వచ్చాయి. ఏడుచోట్ల పోటీచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ ఐదుచోట్ల గెలిచింది. డెబ్బయి ఒక్క స్థానాలలో పోటీచేసిన భాజపాకు పది సీట్లు మాత్రం దక్కాయి. అజిత్‌సింగ్‌తో పొత్తుపెట్టుకున్న పార్టీలకు ప్రయోజనం పెద్దగా ఉండబోదన్న వాస్తవం ఇలా మరోసారి ధ్రువపడింది. ఇప్పుడు ఈ మూడున్నర శాతం వోట్లు ‘యుపిఏ’ కూటమికి బదిలీ అయినందువల్ల కాంగ్రెస్‌కు కొన్ని నియోజకవర్గాలు అదనంగా లభించవచ్చు. అజిత్‌సింగ్ మద్దతుదారులు, ఆయన పార్టీ అభ్యర్థులు లేనిచోట్ల, కాంగ్రెస్‌ను కాని, భాజపాను కానీ బలపరచబోరన్నది ఎన్నికల చరిత్ర ధ్రువపరచిన వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్న నేపథ్యంలో అప్రతిష్ఠ పాలవుతున్న అజిత్‌సింగ్‌ను కలుపుకొనడం అంతుపట్టని వ్యూహం! అగ్రకులాల వోటర్లను ఆకట్టుకొనడం ద్వారా 2007నాటి ఎన్నికలలో గెలిచిన మాయావతి ఇప్పుడు ‘రాష్ట్ర విభజన’ పథకంద్వారా ప్రయోజనం పొందడానికి యత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని శాసనసభ తీర్మానించింది కూడా! తద్వారా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలోను మెజారిటీ శాసనసభ స్థానాలను గెలవడం ఆమె కొత్త వ్యూహం! ఈ వ్యూహాన్ని ఎదుర్కోగల ప్రతివ్యూహం ప్రత్యర్థులవద్ద లేకపోవడం మాయావతికి అనుకూలిస్తున్న అంశం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి