26, డిసెంబర్ 2011, సోమవారం

ఆహార సందేహం

ఆహార సందేహం!.December 22nd, 2011
మూడేళ్లుగా కొనసాగుతున్న అనేక సందేహాలకు సమాధానాలు లభించకపోవడం గురువారం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చిన ‘జాతీయ ఆహార భద్రత’ బిల్లునకు నేపథ్యం. బిల్లును లోక్‌సభకు సమర్పించిన ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రి కె.వి.్థమస్ ఆ తరువాత ఇచ్చిన ‘వివరణ’ మరిన్ని సందేహాలను కలిగిస్తోంది. నిరుపేదలను నిర్థారించడానికి వీలుగా ‘ప్రణాళికా సంఘం’ వారు నిర్ణయించిన ‘కొలమానం’ ఆహార భద్రతను నిలదీస్తున్న విషయం మాత్రం మరోసారి స్పష్టమైపోయింది. బిల్లులో నిర్వచించిన ‘ప్రాధాన్య కుటుంబాల సంఖ్య’ దేశంలోని మొత్తం కుటుంబాలలో సగం కంటె తక్కువ అన్నది స్పష్టమైన మరో అంశం. అయితే గ్రామీణ ప్రాంతాలలో చౌక ఆహారం అవసరమైన డెబ్బయి ఆరు శాతం ప్రజలకు, పట్టణ ప్రాంతాలలోని ‘అవసరమైన’ యాభయి శాతం ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. ‘్భద్రత’ అవసరమైన కుటుంబాలను ఎలా నిర్థారించి ఈ ‘శాతా’లను కనిపెట్టారన్నదానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు! ‘ప్రాధాన్యం’ కల కుటుంబాల సంఖ్య ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా నిర్థారించిన నిరుపేదల కుటుంబాల సంఖ్యతో దాదాపు సమానమట. ఈ సంగతిని ఆహార మంత్రి స్వయంగా అంగీకరించారు. ప్రణాళికా సంఘం వారు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని మాత్రమే నిరుపేదలుగా గుర్తించారు. ఇలా గుర్తించిన తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు, విపక్షాలు విమర్శించాయ. కుటుంబాలు పెట్టే ఖర్చు ప్రాతిపదికగా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారిని ప్రణాళికా సంఘం గుర్తించడం విమర్శలకు దోహదం చేసింది. ఈ ఖర్చుకు అత్యంత తక్కువ ‘గరిష్ఠ స్థాయి’ని విధించడం విమర్శలకు దారితీసిన మరో వైపరీత్యం! నిరుపేదలను నిర్థారించడానికి ప్రణాళికా సంఘం వారు మొదట 2006వ సంవత్సరం నాటి ధరలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టడంతో ప్రణాళికా సంఘం ప్రస్తుత ధరల ప్రాతిపదికగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించింది. గ్రామీణ ప్రాంతంలో సగటున ప్రతిదినం ఇరవై రూపాయలకంటె తక్కువ ఖర్చుచేసేవారు, పట్టణ ప్రాంతాలలో ముప్ఫయి రెండు రూపాయల కంటె తక్కువ ఖర్చుపెట్టేవారు మాత్రమే ‘దారిద్య్రరేఖకు దిగువన ఉన్న’ నిరుపేదలని గత సెప్టెంబర్‌లో ప్రణాళికా సంఘం నిర్ధారించింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రణాళికా సంఘం మాట మార్చింది. ఆహార భద్రత పథకం ప్రయోజనం పొందేవారిని గుర్తించడానికి ‘దారిద్య్రరేఖకు దిగువన ఉండడం’-బిపిఎల్- ప్రాతిపదిక కాబోదని వివరణ ఇచ్చింది. దేశంలోని అవసరమైన కుటుంబాల వారందరికీ చౌక ఆహారం సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రణాళికా సంఘం వారి ‘విచిత్ర నిర్థారణ’ ప్రాతిపదికగానే ప్రభుత్వం ‘ప్రాధాన్య కుటుంబాల’ను గుర్తించినట్టు ఇపుడు తెలిసిపోయింది. అంటే ‘బిపిఎల్’- కుటుంబాలకు మాత్రమే చౌక ధరలు వర్తిస్తాయన్నమాట! ఎటొచ్చీ ఈ కుటుంబాలను ‘దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు’ అని పిలవడం మాని ‘ప్రాధాన్యం కల కుటుంబాలు’ అని నిర్వచిస్తున్నారు. పేరు ఏదయితేనేమి? వైపరీత్యం మాత్రం అదే.
గురువారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం ప్రాధాన్యం కల కుటుంబాల వారికి మాత్రమే అతి చౌక ధరలకు బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు విక్రయిస్తారట! అవసరమైన కుటుంబాలవారందరికీ కాదన్నమాట! అంటే ‘ప్రాధాన్యం’ కల కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ కనీసం ఏడు కిలోల బియ్యం గోధుమలు ముతక ధాన్యం ఇస్తారట! మూడు రూపాయలకు బియ్యం, రెండు రూపాయలకు గోధుమలు, రూపాయికి ముతక ధాన్యం- సజ్జలు, జొన్నలు వంటివి- కిలో చొప్పున విక్రయిస్తారట! బాగుంది. కానీ ఏఏవి ఎనె్నన్ని కిలోలు ఇస్తారు? అన్న స్పష్టత లేదు. సాధారణ తరగతివారికి ఒక్కొక్కరికి నెలకు మూడు కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయట. ‘సాధారణ తరగతి’ అంటే ‘ప్రాధాన్యం’లేని ‘అవసరం ఉన్న’ కుటుంబాలు కావచ్చు! అంటే గ్రామీణ ప్రాంతాలలోని లాభోక్తులలో ఇరవై తొమ్మిది శాతం మందికి, పట్టణాలలోని లబ్దిదారులలో ఇరవై రెండు శాతం మందికి సగటున దక్కేవి నెలకు మూడు కిలోలన్నమాట! ఈమూడు కిలోలు కూడా రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ‘కనీసపు మద్దతు ధర’ ప్రాతిపదికగా ఈ ‘అవసరమైన’ కుటుంబాలకు విక్రయించే ధరలను నిర్ణయిస్తారట! ఈ ధరలు ‘కనీసపు మద్దతు ధర’లో సగానికి- యాభై శాతానికి- మించి ఉండరాదన్నది మాత్రమే బిల్లులో పొందుపరచిన అంశం! అంటే ఈ వర్గాలకు లభించే మూడు కిలోల బియ్యం ధర కిలో పది రూపాయలు దాటిపోవచ్చు! ‘ఆహార భద్రత అవసరమైన’ కుటుంబాల సంఖ్యను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ‘సర్వే’ జరిపిస్తోందట! ఈ ‘సర్వే’ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తికానున్నదట! కానీ ‘సర్వే’ పూర్తికాకుండానే కుటుంబాల శాతాన్ని ఎలా నిర్థారించారు? ‘సర్వే’లో ఏ ప్రాతిపదికగా ఈ కుటుంబాలను నిర్థారిస్తున్నారనే అంశాలను ప్రభుత్వం వెల్లడించకపోవడం ‘ఆహార భద్ర’పై సందేహాలు కలగడానికి అవకాశం ఇచ్చింది. పట్టణ ప్రాంతాలలో ఇలాంటి ‘సర్వే’ అసలు జరగడమే లేదు... మరి ఎలా ‘అవసరమైన’ కుటుంబాలను పసికట్టారు?
ఈ కొత్త పథకం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ముప్ఫయి వేల కోట్ల రూపాయలు అదనంగా వార్షిక వ్యయం ఏర్పడనున్నదట! ఈ ‘సబ్సిడీ’ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలని బిల్లులో నిర్దేశించారు. అయితే కేంద్రం వాటా ఎంత? అన్నది మాత్రం ఇంకా నిర్థారణ కాలేదు. ఈ ‘వాటా’ల సంగతి బిల్లులోనే ఎందుకని నిర్థారించలేదు? అలాంటి నిర్థారణ’కు కొన్ని రాష్ట్రాల అభ్యంతరాలు చెప్పడంవల్లనే కేంద్రం ‘ఆ ‘సంగతి’ని దాచిపెడుతోందన్న విమర్శకూడా వినబడుతోంది. అంతేకాక ఈ కేంద్ర పథకంతో సంబంధం లేకుండా అనేక రాష్ట్రాలలో ఇప్పటికే ‘సబ్సిడీ’పై ఆహార ధాన్యాలను విక్రయించే పథకాలను అమలు జరుపుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సరఫరా చేస్తోంది నిరుపేదలకు... అలాగే మన రాష్ట్రంలోని నిరుపేదలకు రూపాయికి కిలో చొప్పున ప్రభుత్వం విక్రయిస్తోంది! ఇలాంటి రాష్ట్రాలలో ఈ కొత్త పథకంవల్ల లభించే ప్రయోజనం ఏమిటన్న చర్చ మొదలైపోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు జరుపరాదని తమిళనాడు ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం మొదలైపోయింది కూడా! దేశమంతటా ఒకే ధర ఉండాలనుకున్నట్టయితే రూపాయికే అన్ని రాష్ట్రాలలోను కిలో చొప్పున బియ్యం, గోధుమలు విక్రయించాలి! దానివల్ల పెరిగే భారాన్ని మోయడానికి కేంద్రం సిద్ధంగా లేదు! నిరుపేద బాలల భోజన పథకం, ‘అంత్యోదయ అన్న యోజన పథకం’ వంటి వాటిని కూడా ఈ కొత్త భద్రతా పథకంలో చేర్చనున్నారట! పదునాలుగేళ్ల లోపు బాలబాలికలకు మధ్యాహ్న భోజనం2 పెట్టాలన్నది లక్ష్యం! అలాంటపుడు అనేక రాష్ట్రాలలోని బడులలో ఇదివరకే అమలు జరుగుతున్న భోజన పథకాలను ఈ కొత్త పథకంలో విలీనం చేయనున్నారా? ‘ఆహారం’పై సబ్సిడీలను పెంచడానికి వీలుగా ఇంధనం చమురు వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసి, ఈ వ్యవస్థను అంతర్జాతీయ విఫణితో అనుసంధానం చేసే కార్యక్రమం ఇదివరకే మొదలైంది మరి! ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటారా...?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి