26, డిసెంబర్ 2011, సోమవారం

‘పాలన’ వివాదం!.

‘పాలన’ వివాదం!.December 14th, 2011
లోక్‌పాల్ బిల్లును వ్యతిరేక దిశలలో లాగడానికి కేంద్రం, అన్నాహజారే బృందం, కృతనిశ్చయులై ఉన్నారన్నది స్పష్టమైపోయిన సత్యం. పార్లమెంటు స్థారుూ సంఘం వారు చేసిన సిఫార్సులను కొన్నింటిని, ఆమోదించకపోవడం ద్వారా ప్రభుత్వంవారు హజారే బృందానికి ఆగ్రహం తెప్పించారు. అన్ని రాజకీయ పక్షాల మధ్య దాదాపు ఏకాభిప్రాయం కుదిరిన సమయంలో కేవలం ఒక్క అంశం గురించి ‘తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న’ విధానాన్ని హజారే బృందం వారు పునః ప్రారంభించడం విలంబన పథంలో సంభవించిన మరో వైపరీత్యం. లోక్‌పాల్ పాలనా అధికార పరిధిలోని ‘సిబిఐ’ని చేర్చాలనేది హజారే బృందం పట్టు! ఈ కోరికను అంగీకరించకపోయినట్టయితే హజారే ఈనెల 27వ తేదీ నుంచి మళ్ళీ నిరాహార దీక్షను ఆరంభించనున్నారు. ఆలోగా ‘కోరిక’ను అంగీకరించినట్లయితే 27వ తేదీన ఉత్సవం జరుపుతారట. ‘లోక్‌పాల్’ బిల్లు ఈ సమావేశంలో పార్లమెంటు ఆమోదం పొందదు. 22వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగిసిపోనున్నాయి. అంటే ఈ సమావేశాల సందర్భంగా ‘లోక్‌పాల్ బిల్లు’ను పార్లమెంటు ఆమోదించకపోయినప్పటికీ ఫర్వాలేదని హజారే బృందం వారు భావిస్తున్నట్టే కదా! ఈ సమావేశాల్లోనే ‘బిల్లు’ ‘చట్టం’ కావాలని చెబుతున్న వారు ఇలా 27వ తేదీ వరకు గడువును పొడిగించడం పరస్పర విరుద్ధమైన వైఖరులకు అద్దం పడుతోంది. గత ఎనిమిది నెలలకు పైగా జరిగిన చర్చలు నడచిన ఉద్యమాలు, చెలరేగిన విభేదాలు, కుదిరిన ఏకాభిప్రాయాలు ‘లోక్‌పాల్’ న్యాయాధికార పరిధి గురించి మాత్రమే. ఇప్పుడు ‘సిబిఐ’పై ‘లోక్‌పాల్’కు ‘పాలనాధికారం’ ఉండాలన్న కోర్కె ప్రధానమైపోయింది. ప్రధానమంత్రి పదవిలో ఉన్నవారిపై వచ్చే అభియోగాలను విచారించే హక్కు ‘లోక్‌పాల్’కు లభించడంవల్ల రాజకీయ విభేదాలు సమసిపోయినట్టే. ‘లోక్‌పాల్’కుండవలసిన న్యాయాధికారం పరిధి ఇందువల్ల విస్తరించింది. అందువల్ల పాలనాధికారం గురించి పేచీలు పెట్టడం ఈ దశలో అనవసరం.
స్థారుూ సంఘంవారు ప్రధానమంత్రిని లోక్‌పాల్ న్యాయాధికార పరిధిలోకి చేర్చలేదు. అలా చేర్చిన ‘ఘనత’ మంత్రివర్గానికి అధికార భాగస్వామ్య పక్షాలకు దక్కింది. ‘సిబిఐ’ గురించి స్థారుూ సంఘం చేసిన సిఫార్సును ప్రభుత్వ పక్షాలు తోసిపుచ్చాయి. ఇలా ‘స్థారుూ సంఘం’ తుది నివేదిక విప్లవాత్మకమైన పరిణామాలకు గురికావడం ప్రభుత్వం ఆడిన నాటకంలో భాగం. ప్రభుత్వం ఆగిన చోటనుండి హజారే బృందం వారు అందుకున్నారు! ఆలస్యం చేయడమే లక్ష్యం!! ప్రభుత్వ నిర్వాహకులైన రాజకీయ వేత్తల కనుసన్నలలో మెలుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ , ఆదాయం పన్ను విభాగం వారి ‘కార్యాచరణ మండలి’ వంటి సంస్థలు సాధారణంగా దర్యాప్తును ఆరంభించవు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించేవరకు ‘సిబిఐ’లో కదలిక రాకపోవడం సమీప గతంలో జరిగిన పరిణామాల వల్ల ధ్రువ పడిన వాస్తవం. రెండవశ్రేణి టెలికామ్ తరంగాల కేటాయింపునకు, కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణకు సంబంధించిన కుంభకోణాల దర్యాప్తులు ఇందుకు నిదర్శనం. సుఖ్‌రామ్ వంటి మాజీ కేంద్రమంత్రిపై విచారణ ప్రక్రియను 1996 నుంచి ‘అప్పీళ్ళకప్పీల’ను దాటలేకపోతోంది. ‘లోక్‌పాల్’ వ్యవస్థీకృతమైన తరువాత ఇలాంటి న్యాయ విలంబాన్ని నిరోధించవచ్చు. ప్రథమ ఆరోపణ పత్రం దాఖలైన తరువాత ఏడేళ్ళ లోగా దర్యాప్తు, విచారణ పూర్తిఅయి తీర్పులు వెలువడాలని లోక్‌పాల్ బిల్లు నిర్దేశిస్తోంది కనుక ఈ నిబంధన న్యాయ ప్రక్రియ వేగవంతం కావడానికి అంకుశం వలె ఉపకరిస్తుంది. కేంద్రమంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నేర విచారణ విధాన స్మృతి లోని నిబంధనల మేరకు రాష్టప్రతి అనుమతి కావాలి. అలాగే అత్యున్నత స్థాయిలోని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో దర్యాప్తులు జరపడానికిప్రభుత్వం అనుమతి ప్రసాదించాలి. ‘లోక్‌పాల్’ న్యాయస్థానం వారు ఇలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా దర్యాప్తునకు ఆదేశించగలరు. అభియోగపత్రం దాఖలయిన తరువాత సత్వర విచారణ జరిపి తీర్పులు చెప్పగలరు. దశాబ్దుల తరబడి దర్యాపులు నడిచిపోతుండటం, నేరాల తీవ్రత తద్వారా నీరుకారిపోవడం, నిందితులు మరణించడం, నేరస్థులు నిర్దోషులుగా బయటపడడానికి వీలు కలగడం వంటి వైపరీత్యాలను ‘లోక్‌పాల్’ వ్యవస్థ నిరోధించగలదు. ‘లోక్‌పాల్’ వ్యవస్థకు అంకురార్పణ జరగగానే ఉన్నతాధికారులు, అత్యున్నత అధికార రాజకీయవేత్తలు, ప్రజాప్రతినిధులు నిజాయతీపరులుగా మారిపోవడం కల్ల. అవినీతి ఆరోపణల గురించి కొంత వేగంగాను, మరికొంత సరళంగాను నిగ్గు తేల్చడానికి మాత్రమే ‘లోక్‌పాల్’ వ్యవస్థ ఉపయోగపడగలదు.
దర్యాప్తులపై ‘లోక్‌పాల్’ నియంత్రణ గురించి వివిధ రాజకీయ పక్షాలు స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ, ఈ దర్యాప్తుపై లోక్‌పాల్‌కుండే అధికార పరిధి గురించి స్పష్టమైన నిబంధనలు రూపొందలేదు. దర్యాప్తును ప్రారంభించడానికి ముందు ‘సిబిఐ’ వారు లోక్‌పాల్ అనుమతిని తీసుకోవాలన్నది పార్లమెంటరీ స్థారుూ సంఘం వారు తమ తుది నివేదికలో విధించిన నిబంధన. ఈ నిబంధనను ‘సిబిఐ’ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు రాజకీయ పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ‘సిబిఐ’ను లోక్‌పాల్ పరిధినుంచి మినహాయించారు. ప్రధానమంత్రి పదవిలో ఉండే వారిపై వచ్చే ఆరోపణలను ‘లోక్‌పాల్’ న్యాయస్థానం వారు ఆయా ప్రధాన మంత్రులు పదవులను పరిత్యజించిన తరువాత విచారించాలని స్థాయా సంఘం మరో ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాన అమలు జరిగినట్టయితే అవినీతి గ్రస్తులైన ప్రధానులు అనేక ఏళ్ళపాటు విచారణంను వాయిదా వేసి హాయిగా పదవులలో కొనసాగవచ్చు. ‘సి’ తరగతి ప్రభుత్వ ఉద్యోగులను ‘లోక్‌పాల్’ పరిధినుంచి మినహాయించాలన్నది స్థారుూ సంఘం వారి మరో ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను కూడా రాజకీయ పక్షాలు తిరస్కరించాయి. లోక్‌పాల్‌కు అనుబంధంగా ఏర్పాటయ్యే ‘అంబుడ్స్‌మాన్’ పరిధిలోకి ‘సి’ తరగతి ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలను చేర్చుతారట. ‘సిబిఐ’ వారు స్వతంత్రంగా దర్యాప్తు చేసే నేరాలకు సంబంధించిన అభియోగాలను లోక్‌పాల్‌కు నివేదించాలా? లేక ప్రత్యేక న్యాయస్థానాలకు నివేదించాలా? అన్న విషయం గురించి కూడా స్పష్టత ఏర్పడలేదు. ప్రస్తుతం సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థ. కేంద్ర ప్రభుత్వం నిర్వాహకులు ‘సిబిఐ’ని అనధికారికంగా అదుపు చేయడం రాజకీయ సమస్య. కానీ సిబిఐని పూర్తిగా ‘లోక్‌పాల్’కు అనుబంధంగా మార్చడం అభిలషణీయం కాదు. ప్రభుత్వ పాలనా పరిధి నుంచి ‘సిబిఐ’ను తప్పించ దలచుకున్నట్టయితే ఆ విభాగాన్ని సుప్రీంకోర్టు ఆజమాయిషీ కిందికి తేవచ్చు. ‘లోక్‌పాల్’ తీర్పులను సైతం సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సిబిఐ మాజీ డైరెక్టర్ ఆర్‌కె రాఘవన్ వంటి వారు ‘సిబిఐ’పై ‘లోక్‌పాల్’కు పాలనా సంబంధమైన అధికారం ఉండవచ్చునని సూచిస్తున్నారు. అన్నా హజారే బృందంవారు ‘సిబిఐ’ని ‘లోక్‌పాల్’ పాలనాధికార పరిధిలో చేర్చాలని పట్టుబట్టడానికి ఇలాంటి సూచనలు కారణం కావచ్చు. ఏమయినప్పటికీ ప్రస్తుత సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ‘లోక్‌పాల్’ బిల్లునకు ఆమోదం లభించబోదన్నది స్పష్టమవుతున్న అంశం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి