26, డిసెంబర్ 2011, సోమవారం

మత్తుకు ‘మందు’

మత్తుకు ‘మందు’!.December 8th, 2011
సమాజానికి మద్యం మత్తెక్కిస్తున్న వారిని శిక్షించడానికి జరుపుతున్న ప్రయత్నంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టం విప్లవాత్మక పరిణామం. దేశం మొత్తంమీద మద్యం సేవించడం మూమూలు విషయమై పోయిన నేపథ్యంలో నకిలీ పానీయాలు, కల్తీపానీయాలు, కలుషిత పానీయాలు ప్రాణాలను హరిస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వారు ‘సక్రమంగా’ సరఫరా చేస్తున్న సారాను అక్రమంగా సేవిస్తున్న వారు సృష్టిస్తున్న బీభత్స సమాజాన్ని నిరంతర భయ విభ్రాంతికి గురి చేస్తుండటం కూడా దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న మాదక దృశ్యం. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం ప్రలోభాన్ని ప్రభావాన్ని నిరోధించడానికి వీలుగా గుజరాత్‌లో రూపొందించిన చట్టం సామాజిక విచక్షణ భావ పథంలో మరో ముందడుగు. దేశ వ్యాప్తంగా అమలు జరుపడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని రూపొందించినప్పటికీ, నకిలీ మత్తు పానీయాల విషగ్రస్తులైపోతున్న వారి సంఖ్యను క్రమంగా తగ్గించవచ్చునేమో? గుజరాత్ శాసనసభ 2009లో రూపొందించిన కొత్త బిల్లును గవర్నర్ కమలా వేణీవాల్ ఇటీవల ఆమోదించారట. నకిలీ మద్యం తయారు చేసినవారికి, రవాణా చేసినవారికి, పంపిణీ చేసిన వారికి కొత్త చట్టం ప్రకారం మరణశిక్షను విధించడానికి వీలుంది. ‘కల్తీ’ మృతులు గుజరాత్‌లో మరింత భారీ సంఖ్యలో ఉన్నారు. 1989లో వడోదరా నగరంలో కలుషిత సారా తాగిన కారణంగా రెండు వందల యాబయి ఏడు మంది అకాల మరణం పాలయ్యారు. 2009లో కల్తీ మద్యం వేటుపడి మరో నూట యాబయి ఏడుమంది అహమ్మదాబాద్‌లో దుర్మరణం పాలయ్యారు. అంతేకాక మరో మూడు వందల యాబయి మందికి పైగా వివిధ సమయాలలో గుజరాత్‌లో నకిలీ సారా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రభుత్వం దృష్టికిరాని కల్తీ మరణాలు ఇంకెన్నో? కల్తీ సారా వంటి ‘లాథా’ మద్యం తయారు చేసే వారిని మరణశిక్షకు గురి చేయాలన్న గుజరాత్ ప్రభుత్వం పట్టుదలకు ఇదీ నేపథ్యం. ఇంతవరకు గుజరాత్‌లోను, మహారాష్టల్రోను అమల్లో వున్న 1949వ సంవత్సరం నాటి ‘బొంబాయి మద్య పాన నిషేధ చట్టం’ ప్రకారం నకిలీ మత్తును పంపిణీ చేసేవారికి ఉత్పత్తి చేసేవారికి కేవలం ఏడాది జైలుశిక్ష విధిస్తున్నారు. ప్రాణాలు పోయిన సందర్భాల్లో కూడా ఇంతకంటే ఎక్కువ శిక్షలు వేయడానికి వీలు లేదు. కొత్త చట్టం ఝలిపిస్తున్న కొరడా అందువల్ల చాలా భయంకరంగా కనిపిస్తోంది. నకిలీ మత్తుపానీయాలను సేవించినవారు మరణించిన సందర్భాల్లో సైతం ఉత్పత్తిదారులకు మరణశిక్ష విధించడం ‘నేరానికి విధించిన దండన’ అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ గవర్నర్ స్వయంగా ఈ అనుమానాలు వ్యక్తం చేయడం 2009 నాటి శాసనసభ ఆమోదం పొందిన బిల్లు రెండేళ్ళకు పైగా చట్టం కాలేకపోవడానికి కారణం. ‘మరణశిక్ష’ను రద్దు చేసి గరిష్ఠశిక్షను యావజ్జీవ కారాగార శిక్ష స్థాయికి కుదించాలని సూచిస్తూ గవర్నర్ బిల్లును తిప్పి పంపారు కూడా! అయితే గవర్నర్ సూచనను ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతిపక్షాలుకూడా తోసిపుచ్చాయి. ఇలా ఏకాభిప్రాయం వ్యక్తం కావడం నకిలీ మద్యం సృష్టిస్తున్న బీభత్సకాండ తీవ్రతకు నిదర్శనం. గుజరాత్ శాసనసభ యథాతథంగా బిల్లును రెండవసారి ఆమోదించడంతో గవర్నర్‌మోదించడం అనివార్యమైపోయింది. నకిలీ మద్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాల్లో మద్యాన్ని తయారు చేసినవారు, అమ్మినవారు ఇక బతికి బయటపడటం కల్ల.
కొత్త చట్టం ప్రకారం నకిలీ మద్యం ఉత్పత్తిదార్లు, విక్రేతలు కేసు విచారణ పూర్తయ్యేవరకు కటకటాలను లెక్కపెట్టవలసి వస్తుంది. ఇంతవరకు నకిలీ మద్యం తయారు చేయడం తీవ్ర నేరం కాదు. అందువల్ల నిందితులకు సులభంగా ‘బెయిల్’ మంజూరైపోయేది. కొత్త చట్టం ప్రకారం కల్తీ మద్యం తయారు చేయడం తీవ్రమైన నేరం. అందువల్ల ప్రాణాలు తీసే మద్యాన్ని తయారు చేసిన అభియోగంపై అరెస్టయిన నిందితులు కేసు విచారణ పూర్తయ్యే వరకు నిర్బంధంలో ఉండవలసిందే. ప్రాణాలకు ప్రమాదం కలుగని సందర్భాల్లో సైతం కలుషిత మద్యాన్ని నకిలీ మద్యాన్ని తయారు చేసిన వారిని పదేళ్ళ వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. నేరస్థులతో కుమ్మక్కయి, దర్యాప్తును నీరు కార్చే పోలీసులకు సంవత్సర కాలంపాటు జైలు శిక్ష విధించడానికి కొత్త చట్టం వీలుకల్పిస్తున్నది. అందువల్ల ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలను నీరుకార్చి అక్రమంగా మద్యం తయారు చేసే వారి సంఖ్య తగ్గవచ్చు. నకిలీ, కల్తీ, కలుషిత మద్యాలు, సృష్టిస్తున్న బీభత్సం కంటే ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న చేయిస్తున్న ‘సక్రమ’ మద్యాలు కలిగిస్తున్న ప్రాణనష్టం మాత్రం ఎక్కువగావుంది. పరోక్షంగాను ప్రత్యక్షంగాను ప్రాణ నష్టం కలిగిస్తున్న ప్రభుత్వ మద్యపానమత్తుల నేరాలు అనేక సందర్భాల్లో రుజువు కావడంలేదు. నేరాలు ధ్రువ పరచిన సందర్భాల్లో సైతం ఈ పరోక్ష హంతకులకు వర్తమాన న్యాయ నిబంధనల ప్రకారం లభిస్తున్న శిక్షలు రెండేళ్ళ కారాగార వ్యవధిని దాటడం లేదు. మద్యం సేవించి విధులను నిర్వహిస్తున్న వారి సంఖ్య పెరగడానికి కారణం ప్రధానంగా శిక్షలు తక్కువ స్థాయిలో వుండటమే. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న వివిధ రకాల ప్రమాదాలకు ‘ప్రామాణిక’ మద్యపానం కారణం! మన రాష్ట్ర రాజధానిలోనే ఈ ఏడాది జనవరి అక్టోబర్ నెలల మధ్య 2212 రోడ్డు ప్రమాదాలు జరిగాయట. మద్యం సేవించి వాహనాలు నడిపినవారు వీటిలో అత్యధికశాతం ప్రమాదాలకు కారణమట. ఈ ప్రమాదాలకు బలైపోయినవారిలో అత్యధికులు ద్విచక్రవాహనాలను అడ్డదిడ్డంగా నడిపినవారు. వీరంతా మద్యం మత్తువల్ల రోడ్డు కనబడనివారు! అయితే తాగి ఊగిపోయిన జరిపిస్తున్న ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిలో ముప్పయి ఐదుశాతం మంది తాగనివారు! బస్సు ప్రయాణికులు, రోడ్డుపై నడిచిపోయేవారు, రోడ్డుకు దూరంగా దుకాణాల మందు నిద్రించేవారు- ఇలాంటి ‘తాగని’వారు ‘తాగిన’వారి వాహన బీభత్స కాండకు బలైపోయారు. రోడ్ల జంక్షన్ల వద్ద ‘రాకపోకల రక్షకభటులు’ అప్పుడప్పుడు నిలబడి వాహన చోదకులను పరీక్షిస్తున్నారు. కానీ ఈ పరీక్షలవల్ల తాగి వాహనాలను నడిపించేవారి సంఖ్య తగ్గడంలేదు. ఎందుకంటే తాగిన స్థితిలో మట్టుబడిన వాహన చోదకులవద్ద ‘పరీక్షకులు’ లంచాలు పుచ్చుకొని వదలిపెట్టడం పరిపాటి. వదలి పెట్టని సందర్భాల్లో కూడా వాహనాల డ్రైవర్లకు పడే శిక్షలు చాలా తక్కువస్థాయిలో ఉన్నాయి.
మన రాష్ట్ర రాజధానిలోని ఒక న్యాయస్థానం ఈనెల ఆరవ తేదీన ఇలాటి 211 మంది ‘మాదక చోదకు’లను శిక్షించిందట. శిక్షకు గురయిన వారిలో న్యాయవాదులు, వైద్యులు, పత్రికా రచయితలు, రక్షక భటులు, రాజకీయ కుంటుంబాలవారు మాత్రమే కాక మహిళలు కూడా ఉన్నారట! స్ర్తిపురుష సమానత్వపు మాదక సుగంధాలు ఇలా గుబాళించాయి! సమాజాన్ని మత్తెక్కిస్తున్నాయి. శిక్షించడం హర్షణీయం. కానీ ఏమిటీ శిక్ష! ఒక్కొక్కరికి రెండు వేల ఐదువందల రూపాయలు జరిమానా విధించారట! తాత్కాలికంగా వారి చోదనానుమతి పత్రాలను రద్దు చేశారట! కానీ ‘ఘరానా’లందరూ రెండు లక్షల రూపాయల ‘జరిమానాలు’ సైతం కట్టేయగలరు. కోర్టు వెలుపలకు వచ్చి మళ్ళీ తాగి మత్తెక్కి వాహనాలను నడిపేయగలరు! అలా వారంతా ఇలాంటి నేరస్థులకు కనీసం ఆరు నెలల పాటు జైలుశిక్షను విధించే విధంగా న్యాయ ప్రక్రియను సవరించామనుకోండి! కొంతలో కొంతైనా భయం పెరుగుతుంది. అందువల్ల గుజరాత్ ప్రభుత్వం మద్యం ముఠాలకు మరణశిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరించడం వౌలిక న్యాయసూత్రాలకు, సహజ న్యాయసాధన ప్రక్రియకు భంగం కలిగించినట్టు కాజాలదు. దురాశ నకిలీ మద్యం వ్యాపారులు ఉత్పత్తిదారులను ఆక్రమంగా సారా బట్టీలను నిర్వహించడానికి పురికొల్పడం మాత్రం వాస్తవం. దురాశకు, నిర్లక్ష్యం తోడై ప్రాణాలను బలిగొంటున్నది. గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన తరహా చట్టాలు ఈ మత్తును కొంతైనా తొలగించగలవు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి