26, డిసెంబర్ 2011, సోమవారం

నీటి రాజకీయం

నీటి రాజకీయం.December 2nd, 2011
కేరళ తమిళనాడు రాష్ట్రాల మధ్య రగులుతున్న ‘నీటిరగడ’ అనేక చిత్రాలను ఆవిష్కరిస్తోంది. నదీజలాల పంపిణీని పర్యవేక్షించడానికి వివిధ నదులపై నిర్మాణం అవుతున్న ఆనకట్టలను ఆజమాయిషీ చేయడానికి కేంద్ర స్థాయిలో శాశ్వత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పరచాలన్న భావానికి ఈకొత్త వివాదం మరింత బలం చేకూర్చుతోంది. రెండు కంటె ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న ప్రతి నది వివాదగ్రస్తం అవుతున్న ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొనివున్న వైపరీత్యం. మూల పెరియార్ గురించి కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పరస్పరం తలపడుతున్నాయి. శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులు నినాదాలు చేయడం ‘మూల పెరియార్’ ప్రహసనంలో సరికొత్త పరిణామం. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ ప్రధానమంత్రిని కలుసుకున్నారు. మూల పెరియార్ ఆనకట్టను కూలగొట్టే కార్యక్రమానికి ఆటంకాలు కల్పించకుండా తమిళనాడు ప్రభుత్వాన్ని ఒప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారట. ప్రధానమంత్రి మాత్రం కేంద్ర జలవనరుల మంత్రి పవన్‌కుమార్ బన్సల్‌తో చర్చించవలసిందిగా కోరారట. సుప్రీం కోర్టువారు జోక్యం చేసుకుంటే తప్ప అంతర్‌రాష్ట్ర నదుల వివాదాలు పరిష్కారం కాకపోవడం అనేకసార్లు ధ్రువపడిన వాస్తవం. మూల పెరియార్ ఆనకట్ట తెగిపోయినట్టయితే తమ ఇడుక్కి జిల్లాలోని దిగువ ప్రాంతమంతా జలమయమైపోయి ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం భారీగా సంభవిస్తుందని కేరళ ప్రభుత్వం చెబుతున్నది. అందువల్ల జలాశయాన్ని ఖాళీ చేసి, తర్వాత ఆనకట్టను కూల్చివేసి, దాని స్థానంలో కొత్త ఆనకట్టను నిర్మించాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే తమ వేఘై, రామరార్ జిల్లాల్లోని ఆయకట్టు ప్రాంతాల వ్యవసాయ క్షేత్రాలు బీడు పడిపోతాయని తమిళనాడు ప్రభుత్వ భయం. ఇలా ఆనకట్టను కొట్టివేయాలా? కొనసాగించాలా? అన్న విషయంలో రెండు రాష్ట్రాలు తగాదా పడుతున్నాయి. కేరళ ప్రభుత్వ ప్రయత్నాలను నిరోధిస్తూ తగిన ఆదేశాలను జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసి నిరోధిస్తే తప్ప కేరళ ప్రభుత్వం ‘మూల పెరియార్’ జలాశయాన్ని కూలగొట్టకుండా నివారించడం తమిళనాడు ప్రభుత్వానికి అసాధ్యమైన విషయం. మూల పెరియార్ జలాశయం కేరళలో ఉన్నప్పటికీ జలాశయం నిర్మాణం జరిగిన ప్రాంతం మాత్రం తమ ఆధీనంలో ఉందనేది తమిళనాడు వాదం.
1895లో ఇడుక్కి జిల్లాలో రెండు పెద్ద వాగులు-ఉపనదులు- కలిసే చోట దిగువ ప్రాంతాన ఈ ఆనకట్టను నిర్మించారు. ఈ ప్రాంతంలోని స్థలాన్ని అప్పటి కొచ్చిన్ సంస్థానం నుండి బ్రిటిష్ వారి పాలనలో ఉండిన మదరాసు ప్రాంతం వారు అద్దె-లీజ్-కు తీసుకున్నారట. తొమ్మిది వందల తొంభయి తొమ్మిది ఏళ్ళపాటు స్థలాన్ని ‘లీజ్’కు ఇవ్వడం కూడా విచిత్రమైన అంశం. అయితే 1956లో మలబార్, తిరువాన్కూర్, కొచ్చిన్ ప్రాంతాలు కలిసిపోయి కేరళ రాష్ట్రంగా ఏర్పాటయింది. ఈ ‘పెరియార్’ ఆనకట్టపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహణాధికారం ఏర్పడివుంది. తమిళనాడులోని మదురై జిల్లాలో మరో పెరియార్ జలాశయం వెలసిన తర్వాత ఇడుక్కి జిల్లాలోని ‘పెరియార్’ను మూల- మొదటి-పెరియార్ జలాశయంగా స్థానికులు గుర్తిస్తున్నారు. ఈ ఆనకట్ట పాత పడిన దృష్ట్యా కూలిపోవడానికి సిద్ధంగా వున్నదని స్థానికులు ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 26న ఇడుక్కి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించడం ఈ భయాందోళనలను మరింత ఉధృతం చేసింది. 1970 నుంచి ఆనకట్ట ప్రాంతంలో దాదాపు 1300 సార్లు ఇలాంటి స్వల్ప భూప్రకంపనలు ఏర్పడినట్లు కేరళ రాష్ట్ర విద్యుత్ మండలి వారి పరిశోధన విభాగం వారు కనిపెట్టారట. భూప్రకంపనల గురించి భూగర్భ పరిశోధన శాస్తవ్రేత్తలు నిర్ధారించాలిగాని, విద్యుత్ విభాగం వారు కనిపెట్టడమేంటన్నది తమిళనాడు ప్రభుత్వం సంధించిన ప్రశ్న. ఈ ప్రకంపనలన్నీ‘రిచ్‌స్టార్’ ప్రాతిపదికగా నాలుగు పాయింట్లకు మించడం లేదు కనుక ఎలాంటి భయాందోళనలకు తావులేదన్నది తమిళనాడు వాదం. 1976లో ‘అతి’గా భూమి కంపించినప్పుడు కూడా ‘తీవ్రత’ స్థాయి 3.4 ‘రిచ్‌స్టార్’ పాయిట్లను దాటలేదట. భూకంపం తీవ్రతను తట్టుకొనే విధంగా దృఢంగా ఈ ఆనకట్టను బ్రిటిష్ వారు నిర్మించారని తమిళనాడు వాదిస్తోంది. శనివారం నాటి ప్రకంపనల ప్రభావం ఆనకట్ట వద్ద మాత్రమేకానీ సమీప ప్రాంతంలో ఎక్కడా కూడా కనిపించడం లేదని భూగర్భ శాస్తవ్రేత్తలు నిర్ధారించారని తమిళనాడు చెబుతోంది.
‘పెరియార్’ పేరును ప్రస్తావించకుండా ఒక పాత ఆనకట్ట తెగిపోయినప్పుడు సంభవించే భయంకర పరిణామాలను ‘డామ్ 999’ అన్న పేరుతో నిర్మాణమైన సినిమాలో చిత్రీకరించారట. ఈ సినిమా విడుదలైన తర్వాత ‘పెరియార్’ వ్యతిరేక ఆందోళన మరింత ఉధృతమైంది. తమిళనాడు ప్రభు త్వం ఈ సినిమాను తమ రాష్ట్రంలో ప్రదర్శించరాదని ఆదేశించింది. ‘డామ్ 999’ చిత్రం, ఆనకట్ట తెగిపోయి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం వేలాది మంది వరదనీటిలో పడి కొట్టుకొనిపోవడం ప్రధాన ఇతివృత్తమట. ఫలితంగా ‘మూల పెరియార్’ను కూల్చివేయాలని కోరుతూ 1800 రోజులుగా జరుగుతున్న అంచెలవారీ-రిలే-నిరాహారదీక్షలకు ప్రజాదరణ పెరిగిపోయింది. కేరళ హైకోర్టులో ‘పిటిషన్లు’ దాఖలు కావడం, ‘పెరియార్’ భద్రత గురించి నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆదేశించడం ఈ ఉధృతికి అద్దం పడుతున్న మరో పరిణామం. ‘్భద్రత’ను అంచనా వేయడంకోసం కేరళ ప్రభుత్వం నియమించిన శాస్తవ్రేత్తలు పాత ఆనకట్టను తొలగించి కొత్త ఆనకట్టను నిర్మించాలని సూచించారట. అందువల్ల సొంత ఖర్చులతో కొత్త ఆనకట్టను నిర్మించడానికి కేరళ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ సమస్య తీవ్ర రూపం ధరించడంతోపాటు రాజకీయమైపోయింది కనుక, ప్రతిపక్షాల దాడిని తట్టుకోవడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అతిగా స్పందించవలసి వస్తోంది. ‘మూల పెరియార్’పై తమిళనాడుకు ఎలాంటి హక్కు లేదని, జలాల్లో వాటా కూడా లేదని, కానీ మానవతా దృష్టితో దశాబ్దులుగా తమిళ రైతులకు తగినంత సేద్యపు నీటిని విడుదల చేస్తున్నామని కేరళ ప్రభుత్వం చెప్పుకొస్తోంది! ఉభయుల వాదంలోను అతిశయోక్తులు, అసత్యాలు ధ్వనిస్తున్నప్పటికీ జలాశయంలో మరిన్ని జలాలను నిల్వ చేయడానికి వీలుగా ఆనకట్ట ఎత్తును పెంచాలన్న తమిళనాడు ప్రతిపాదన అసలు పేచీకి కారణం. ప్రస్తుతం గరిష్ఠంగా 136 అడుగుల ఎత్తున జలాశయంలో నీళ్ళు నిలుస్తున్నాయట. కానీ ఆనకట్ట ఎత్తును పెంచడం ద్వారా 142 అడుగుల ఎత్తున నీరు నిలిచేవిధంగా వ్యవస్థీకృతం చేయాలని తమిళనాడు కోరుతోంది. ప్రస్తుతం నిలుస్తున్న జలాల ధాటికే ఆనకట్ట కూలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఎత్తును పెంచమని కోరడం కేరళ ప్రజల దృష్టిలో ‘పుండు మీద కారం చల్లడం వంటిది!’ ప్రమాదం ఉన్నప్పటికీ లేనప్పటికీ పాత ఆనకట్టను తొలగించి కొత్తగా పటిష్టంగా నిర్మించడం వాంఛనీయం. అయితే ఉభయ రాష్ట్రాలవారు ఏకాభిప్రాయంతో ఈ పనికి పూనుకోవడం లేదు. మళ్ళీ కొత్తగా ఆనకట్ట నిర్మాణం జరిగే వరకు మాత్రమే పారుదలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ అంతరాయం శాశ్వతం కానుందని తమిళనాడు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి