26, డిసెంబర్ 2011, సోమవారం

దీదీ దయ!.

దీదీ దయ!.December 5th, 2011
దేశ ప్రయోజనాలను లెక్కచేయని ప్రభుత్వ నిర్వాహకులు రాజకీయ అనివార్య పరిణామాల ముందు తలవంచక తప్పడంలేదు. ఈ వాస్తవ వైచిత్రికి మరో నిదర్శనం ‘చిల్లర’ పెట్టుబడులపై కొనసాగుతున్న వివాదం. చిల్లర వ్యాపార రంగంలో విదేశీయ సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చునన్న నిర్ణయాన్ని మార్చుకునే ప్రశ్న లేదని వారం రోజులపాటు భీష్మించుకున్న కేంద్ర ప్రభుత్వం బెట్టు సడలించడానికి ఏకైక కారణం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరింతగా మొండికెత్తడం! చిల్లర వ్యాపారంలో విదేశీయ సంస్థల ప్రత్యక్ష భాగస్వామ్య- ఎఫ్‌డిఐ- ప్రతిపాదనను ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుంటుందా? లేక తాత్కాలికంగా వాయిదా వేసుకుంటుందా? అన్నది బుధవారం కానీ స్పష్టం కాదట. పార్లమెంటు సభలలో ఆరోజున ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నది ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించిన సరికొత్త సమాచారం. అయినప్పకికీ ప్రస్తుతానికి మన చిల్లర వ్యాపారులు, కిరాణం కొట్టువారు, బడ్డీ కొట్టువారు, నెత్తిగంపల సంచార వర్తకులు, బండ్లను తోసుకునే వీధి వ్యాపారులు ‘వాల్ మార్ట్’ వంటి విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలతో పోటీ పడనవసరం లేదు. ఈ ‘అవసరం’ తప్పించిన ఘనత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీది! ప్రతిపక్షం సాధించలేని పనిని ‘ఐక్య ప్రగతిశీల కూటమి’లోని భాగసామ్య పక్షాలు సాధించగలిగాయి. భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి వారు ఇతర ప్రతి పక్షాల వారు ఐదు రోజుల పాటు పార్లమెంటును స్తంభింప చేసినప్పటికీ ప్రభు త్వం స్పందించలేదు. చిల్లర వ్యాపారుల జాతీయ సంఘాల వారు జరిపిన నిరసన ప్రదర్శనల నినాదాలు ప్రభుత్వం వారికి వినిపించలేదు. కానీ మమతా బెనర్జీ నడుం బిగించి ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా నినదించేసరికి ప్రధాని మన్మోహన్ సింగ్ మెట్టు దిగక తప్పలేదు. వాయిదా తీర్మానంపై లోక్‌సభలో ‘వోటింగ్’ జరిగే పక్షంలో తృణమూల్ సభ్యులు సహకరించకపోతే మన్మోహన్ సర్కార్ కూలిపోవడం ఖాయం! తృణమూల్‌కు తోడుగా డిఎంకె కూడా ‘ఎఫ్‌డిఐ’పై వ్యతిరేకతను ప్రకటించడం మన్‌మోహన్‌సింగ్ ఊహించని పరిణామం. సిద్ధాంతపరంగా కాక కుమార్తె కనిమోళికి కలిగిన ‘కష్టాల’ ప్రాతిపదికగా డిఎంకె అధినేత కరుణానిథి మన్‌మోహన్‌పై కినుక వహించి ఉన్నాడు మరి! సిద్ధాంతం రంగు పూనడానికి ఈ అవకాశం డిఎంకె నాయకుడికి కలిసివచ్చింది. ఈ ‘వ్యూహం’ ఇలా బెడిసికొట్టడానికి కారణం జాతీయ ఆర్థిక స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవాలన్న మమతా బెనర్జీ పట్టుదల. ప్రత్యేక ఆర్థిక మండలులకు వ్యతిరేకంగా ‘బెంగాల్ దీదీ’ నడిపిన ఉద్యమం వల్ల బలవంతపు భూమి సేకరణ ప్రక్రియ వేగం కూడా తగ్గింది. రైతులకు భూమిపై అధారపడే హక్కుకు ప్రత్యామ్నాయ ఉపాధి పునరావాసాన్ని కల్పించిన తర్వాత మాత్రమే వ్యవసాయ భూమిని ప్రభుత్వాలు సేకరించాలన్న కొత్త నిబంధన రూపొందుతుండానికి కారణం. మమతా బెనర్జీ ‘ఐక్య ప్రగతి’ ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి! బంగ్లాదేశ్‌కు తీస్తానది జలాలలో అధిక భాగం ధారదత్తం చేసే ఒప్పందాన్ని గత సెప్టెంబర్‌లో నిరోధించిన మమతమ్మ ఇప్పుడిలా చిల్లర వ్యాపారులను ఆదుకోగలిగింది! స్వదేశీయ ఆర్థిక వ్యవస్థకు, వికేంద్రీకృత వాణిజ్యానికి ఇది మరో విజయం!
అబద్ధాలు రాసి దిద్దుకొనడం అంటే ఇదే కాబోలు. అంతర్జాతీయ అనుసంధానం పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ప్రధానమంత్రి ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ అధికార పక్షాలతో మాత్రమే కాదు, కాంగ్రెస్ వారితో సైతం ‘ఎఫ్‌డిఐ’ విషయమై చర్చించలేదన్నది ఇప్పుడు స్పష్టం. ‘తప్పుల కుప్ప’ను ఆవిష్కరించానని వాణిజ్య మంత్రి ఆనంద్‌శర్మ, ఆహార మంత్రి కె.వి. థామస్ గత నెల 24, 25 తేదీల్లో చేసిన హడావుడి అంతాఇంతా కాదు.తప్పులను సరిదిద్దుకోవలసి వచ్చేసరికి మన్‌మోహన్‌సింగ్ వారిని తప్పించి ‘యథావిథిగా’ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీని పురమాయించవలసి వచ్చింది. మమతా బెనర్జీ అడ్డుపడక పోయి వుండినట్లయితే ‘చిల్లర ఎఫ్‌డిఐ’ వల్ల కోటి ఉద్యోగాలు కొలువు తీరుతాయని ప్రచార ఆర్భాటాన్ని ఆనందశర్మ బహుశా ఆపి వుండే వారు కాదు. చిల్లర వ్యాపారాన్ని, విదేశీయ ‘బహుళ’ సంస్థలకు అప్పగించం వల్ల ద్రవ్యోల్బణం తగ్గిపోతుందని, ‘రిజర్వ్ బ్యాంకు’ నిర్వాహకులు చేసిన సిద్ధాంతం కూడా ఇప్పుడు కేవలం రాద్ధాంతంగా మిగిలి పోనుంది. నిర్ణయం ప్రకటించిన తరువాత వివిధ పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధన గురించి ప్రభుత్వం ప్రసంగిస్తోంది. ఈ ఏకాభిప్రాయ సాధనకోసం ముఖర్జీ కృషి చేస్తున్నారట! నిర్ణయం ప్రకటించడానికి ముందే ఎందుకని ‘ఏకాభిప్రాయ సాధన’కు ప్రయత్నించలేదు? అంతే కాదు, రాజ్యాంగ పరమైన తప్పులకు కూడా పాల్పడినట్టు అంగీకరించట్టయింది. ‘పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల విధాన నిర్ణయాలను సభల వేదికల మీది నుంచి మాత్రమే ప్రకటించాలి,’ అన్న రాజ్యాంగ సంప్రదాయాన్ని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉటంకించారు. మరి ఈ మహావిషయం ప్రభుత్వానికి ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చింది? గత నెల 24వ తేదీన ఈ ‘సంప్రదాయ స్ఫురణ’ ఎందుకని కలుగలేదు? ఆ రోజున మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఆహార మంత్రి హడావుడిగా బయటకు వచ్చి ‘‘చిల్లర వ్యాపారంలో ‘ఎఫ్‌డిఐ’ని అనుమతిస్తున్నాం’’ అని ప్రకటించారు. మరుసటి ఉదయం పార్లమెంట్ సమావేశం వరకు ఎందుకు ఆగలేదు??
ఆర్థిక స్వాంతంత్య్రాన్ని హరించి వేసే సమయంలో ‘చిల్లర’ దోపిడీ ఒక ప్రధాన అంశం. దేశం ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రక్రియ 1990వ దశకం మొదలైన వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్-తో మొదలయింది. ‘వాణిజ్య’ సుంకాల సాధారణ వ్యవస్థ’-గాట్-లో మన దేశం ప్రవేశించిన నాడే ఆరంభమయింది. ‘గాట్’ ఆతరువాత ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’రూపం ధరించే నాటికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వలలో మన వాణిజ్య వ్యవసాయ రంగాలు చిక్కుకు పోయాయి. ‘వల’ బిగుస్తున్న కొద్దీ గిల గిల మంటున్న దృశ్యాలు ఆవిష్కృతవౌతున్నాయి.కానీ వినిపించుకోని ‘బధిరాంధ’ ప్రవృత్తి ప్రభుత్వాలను ఆవహించి వుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభించిన ఘనకార్యాన్ని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆతరువాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం నడిచిపోతున్న విధాన వైపరీత్యం. నమూనాల-పేటెంట్ల- చట్టాన్ని ‘ప్రజాస్వామ్య జాతీయ కూటమి’ -ఎన్‌డిఎ- ప్రభుత్వం రూపొందించకపోయివుండినట్టయితే ప్రపంచీకరణ, మనదేశంలో వ్యవస్థీకృతం అయివుండేది కాదు! బీమా రంగంలో విదేశీయ సంస్థలను ‘్భజపా’ దొరతనం తలుపులు బార్లా తెరిస్తే రక్షణ రంగాన్ని ‘బహుళ’ సంస్థలకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెత్తనం నడుం బిగించింది. చిల్లర వ్యాపారం రాక సంస్థాగత అనుసంధాన భాగస్వామ్యం -ఎఫ్‌డిఐ- ద్వారా విదేశీయ వ్యాపార వేత్తలు ఇదివరకే చొరబడిన సంగతి అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు తెలుసు. ‘ప్రత్యక్ష భాగస్వామ్యం’ గురించి కూడా రెండేళ్ళుగా చర్చ నడుస్తున్నది. అలాంటప్పుడు ప్రతిపక్షాలవారు, దేశవ్యాప్తంగా ఎందుకని ఉద్యమం ఆరంభించలేదు?బెంగాల్ ‘దీదీ’ దడ పుట్టించింది కాబట్టి సరిపోయింది. లేనట్టయితే అమెరికాతో అణు సహకార ఒప్పందం మారినట్టే, చిల్లర వ్యాపారంలో విదేశీయుల పెత్తనం స్థిరపడి వుండేది కాదా??

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి